
ప్రసాద్ మల్టీప్లెక్స్లో అత్యాధునిక ప్రీమియం థియేటర్ ప్రారంభం
పీసీఎక్స్ హెచ్డీఆర్ బై బార్కో’ స్క్రీన్ ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్లలో ఒకటిగా గుర్తింపు
అత్యాధునిక దృశ్య, శబ్ద సాంకేతికతతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి

హైదరాబాద్,(భారతవాసి న్యూస్): హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్లో అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ప్రీమియం థియేటర్ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్లలో ఒకటిగా గుర్తింపు పొందిన “పీసీఎక్స్ హెచ్డీఆర్ బై బార్కో” థియేటర్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. అత్యాధునిక 4కే లేజర్ ప్రొజెక్షన్తో పాటు లైట్ స్టీరింగ్ సాంకేతికతతో ఈ థియేటర్ రూపొందించబడింది. ఈ సాంకేతికత వల్ల ప్రేక్షకులకు అత్యుత్తమ దృశ్య ప్రకాశం, స్పష్టతతో కూడిన శబ్ద అనుభూతి లభిస్తుందని తెలిపారు. ప్రేక్షకులు సినిమాలను మరింత అద్భుతంగా ఆస్వాదించే విధంగా ఈ థియేటర్ నిర్మాణం చేపట్టినట్టు నిర్వాహకులు వెల్లడించారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ప్రసాద్ మల్టీప్లెక్స్ ఎప్పుడూ ముందుంటుందని మంత్రి అభినందించారు. సినిమా రంగంలో నూతన సాంకేతికతను ప్రవేశపెట్టడం వల్ల ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభూతి అందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్య ప్రతినిధి రమేష్ ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీ, సాంకేతిక రంగాలకు చెందిన వ్యక్తులు కూడా హాజరయ్యారు.
