చెల్లాపూర్ సమీపంలో కాలువ దెబ్బతింత
నీరు వృథాగా చెరువులోకి చేరుతున్న పరిస్థితి
త్వరిత మరమ్మతులకు రైతుల డిమాండ్

సిద్దిపేట, మార్చి 19 (భారతవాసి న్యూస్): సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు గండిపడటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మల్లన్నసాగర్ నుంచి దుబ్బాక ప్రాంతానికి నీరు సరఫరా చేసే ఈ కాలువ దెబ్బతినడంతో నీటి ప్రవాహం అంతరాయం కలిగింది. కాలువకు గండిపడటంతో నీరు వృథాగా చెల్లాపూర్ కందూరు చెరువులోకి వెళ్లిపోతోంది. దీంతో కాలువ కింద ఉన్న పంటలకు నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుందేమోనన్న భయం రైతుల్లో నెలకొంది.
ఈ ఘటనపై స్పందించిన నీటిపారుదల శాఖ అధికారులు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. కాలువ లైనింగ్ పనుల్లో నాణ్యత లోపించడమే ఈ సమస్యకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. పనుల్లో నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను కలిసిన రైతులు వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులు స్పందిస్తూ, సాధ్యమైనంత త్వరగా గండిని పూడ్చి నీటి ప్రవాహాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యను అత్యవసరంగా పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
