Homeతెలంగాణబడ్జెట్ ఆమోదం లేకుండా వేల కోట్ల ఖర్చు

బడ్జెట్ ఆమోదం లేకుండా వేల కోట్ల ఖర్చు

  • మండలి చైర్మన్‌కు మల్లన్న ఫిర్యాదు
  • ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘనపై తీవ్ర ఆరోపణలు
  • క్యాగ్ నివేదికల ఆధారంగా కీలక అంశాల వెల్లడి
  • విచారణకు, కఠిన చర్యలకు డిమాండ్

హైదరాబాద్, మార్చి 20 (భారతవాసి న్యూస్): తెలంగాణలో గత పదేళ్లుగా శాసనసభ ఆమోదం లేకుండా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆరోపిస్తూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ తక్షణ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం శాసనసభ ఆమోదం లేకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు వినియోగించడం చట్ట విరుద్ధమని మల్లన్న పేర్కొన్నారు. అయినప్పటికీ 2014 నుంచి 2024 వరకు ఈ నియమాలను ఉల్లంఘిస్తూ భారీగా ఖర్చులు చేసినట్లు ఆరోపించారు. ఇది ఆర్థిక క్రమశిక్షణను పూర్తిగా దెబ్బతీసిందని అన్నారు.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలను ఉదహరిస్తూ మల్లన్న పలు కీలక వివరాలను వెల్లడించారు. 2014-15 నుంచి 2018-19 మధ్య సుమారు 84,650 కోట్ల రూపాయల అదనపు ఖర్చు శాసనసభ ఆమోదం లేకుండా జరిగినట్లు పేర్కొన్నారు. 2018-19లో 29,133 కోట్లకు పైగా, 2019-20లో 47,896 కోట్లకు పైగా అధిక వ్యయం జరిగిందని తెలిపారు.
అలాగే బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోయినా పలు పథకాల పేరిట నిధులు మళ్లించినట్లు ఆరోపించారు. ఉపాధి హామీ పథకం, విద్యుత్ రంగం, కార్పొరేషన్లు, ఆరోగ్య అత్యవసరాలు వంటి విభాగాల్లో భారీగా నిధులు వినియోగించినట్లు పేర్కొన్నారు. ఈ చర్యలు శాసనసభ అధికారాలను అవమానించే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లన్న డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ అంశాన్ని సభ హక్కుల ఉల్లంఘనగా పరిగణించి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజాధనాన్ని నియంత్రణ లేకుండా ఖర్చు చేసే పరిస్థితిని అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Spread the love
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular