– అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచన
– దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళన
– మహిళా బిల్లుకు మద్దతు – పునర్విభజనతో ముడిపెట్టవద్దన్న విజ్ఞప్తి
హైదరాబాద్, ఏప్రిల్ 14 ((భారతవాసి న్యూస్): లోక్సభ నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాశారు. కీలక అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ, దాన్ని లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టవద్దని కోరారు. రెండు వేర్వేరు అంశాలను కలిపి అమలు చేయడం వల్ల అనవసర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.
లోక్సభ నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే పునర్విభజన చేపడితే జనాభా నియంత్రణలో ముందంజలో ఉన్న రాష్ట్రాలు నష్టపోతాయని అన్నారు.
అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాలని ప్రధాని మోదీని కోరారు. దేశ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సమతుల్యతతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇలాంటి కీలక నిర్ణయాలపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సంపూర్ణ చర్చల అనంతరం నిర్ణయాలు తీసుకోవడం అవసరమని తెలిపారు.
లోక్సభ పునర్విభజన బిల్లు ద్వారా ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా చూడాలని, దేశ సమగ్రతకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


