ఉద్యాన పంటలపై అవగాహన సదస్సు


భూపాలపల్లి జిల్లా,భారతవాసి ప్రతినిధి:
జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీ ఏ. సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో శుక్రవారం ఉద్యాన పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు
కాటారం మండల పరిధిలోని గంగారంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి మాట్లాడుతూ, గంగారం గ్రామంలో దాదాపు ప్రతి కుటుంబం కూరగాయల సాగుపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని ఉన్నారు. కూరగాయల సాగు రైతులకు తక్కువ కాలంలో ఆదాయం అందించే ముఖ్యమైన పంటగా నిలుస్తుందని, సరైన ప్రణాళికతో సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. సీజన్‌కు అనుగుణంగా సరైన రకాలు ఎంపిక చేసుకోవడం, నాణ్యమైన విత్తనాల వినియోగం, సమతుల్య ఎరువుల వినియోగం, తగినంత నీటి నిర్వహణ, మల్చింగ్ విధానం వంటి ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా దిగుబడి మరియు నాణ్యత పెరుగుతుందని వివరించారు.


అలాగే ఇంటి వద్ద చిన్న స్థాయిలో కూరగాయల తోటలు (Kitchen Garden) ఏర్పాటు చేసుకోవడం ద్వారా కుటుంబానికి పోషకాహారం అందడమే కాకుండా అదనపు ఆదాయం కూడా పొందవచ్చని సూచించారు.కూరగాయల పంటలలో కనిపించే ముఖ్యమైన చీడపీడలు మరియు వ్యాధులను సమయానికి గుర్తించి సమగ్ర కీటక నియంత్రణ (IPM) పద్ధతులను అనుసరించడం ద్వారా ఖర్చు తగ్గించి మంచి దిగుబడులు సాధించవచ్చని రైతులకు తెలియజేశారు.అదేవిధంగా ఉద్యాన శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలు, ముఖ్యంగా కూరగాయల సాగును ప్రోత్సహించే కార్యక్రమాల గురించి వివరించి, రైతులు వాటిని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కూరగాయల పందిరి నిర్మాణం చేపట్టిన రైతులకు అందించే ప్రోత్సాహకాలు మరియు ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్న ఉచిత కూరగాయల మినీ కిట్లను గ్రామ సర్పంచితో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వ్యవసాయ విస్తరణ అధికారి, ఉద్యాన విస్తరణాధికారి, రాందాస్,రైతులు పాల్గొన్నారు.

Spread the love