మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు రజక సంఘం వినతి.
నర్సంపేట, సెప్టెంబర్ 10:వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని నర్సంపేట పట్టణంలో తెలంగాణ రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం పట్టణ అధ్యక్షుడు కొల్లూరు లక్ష్మీనారాయణ, డివిజన్ గౌరవ అధ్యక్షుడు రాయరాకుల సారంగం, పట్టణ గౌరవ అధ్యక్షుడు ఐలోని శ్రీనివాస్, కార్యదర్శి తడిగొప్పుల రవి మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన నిప్పుకనిక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ఆమె అడుగుజాడల్లో నడుస్తూ, ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.గత ప్రభుత్వం ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారిక లాంచనాలతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించిందని, అలాగే హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత నర్సంపేట మున్సిపల్ అధికారులు ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను కనీసం పట్టించుకోకపోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ రజకులను చిన్నచూపు చూస్తూ, అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.ఈ విషయమై రజక సంఘం నాయకులు నర్సంపేట ఆర్డీఓ (RDO) గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఐలమ్మ వారసులుగా ఉన్న రజకులను నిర్లక్ష్యం చేస్తున్న నర్సంపేట మున్సిపల్ కమిషనర్పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డివిజన్ గౌరవ అధ్యక్షుడు రాయరాకుల సారంగం డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు, సభ్యులు గడ్డమీద బాలకృష్ణ, మామిడాల నరసయ్య, ఇల్లందుల సాంబయ్య, శ్రీహరి, కొల్లూరి రామకృష్ణ, గోపాల్, కొల్లూరి రాజు, రాయరాకుల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.